వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనపై సమాజ్‌వాదీ పార్టీ అనుమానం.. యూపీ ఎన్నికల తర్వాత యథాతథమని ఆరోపణ

  • వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం
  • ప్రధానివి ఉత్తుత్తి క్షమాపణలేనన్న ఎస్పీ
  • యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ వాటిని రైతులపై రుద్దుతారన్న ఎస్పీ
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనపై సమాజ్‌వాదీ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ప్రకటన చేసిందని, ఎన్నికలయ్యాక మళ్లీ వాటిని తీసుకురావడం పక్కా అని తేల్చి చెప్పింది. కేంద్రం ఈ చట్టాలను మనస్ఫూర్తిగా రద్దు చేయలేదని, యూపీ ఎన్నికల తర్వాత తిరిగి వీటిని రైతులపై రుద్దడం ఖాయమని ఆరోపించింది.

రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని పేర్కొన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రధానివి ఉత్తుత్తి క్షమాపణలేనని పేర్కొంది. రాజస్థాన్ గవర్నర్ మిశ్రా శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చట్టాలు అవసరం అనుకుంటే కేంద్రం మళ్లీ వాటిని తీసుకొస్తుందన్నారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బిల్లులు వస్తుంటాయి.. పోతుంటాయి.. మళ్లీ వస్తుంటాయని, అందుకు పెద్ద సమయం పట్టబోదని వ్యాఖ్యనించడం ద్వారా సాగు చట్టాల కథ ముగిసిపోలేదని చెప్పకనే చెప్పారు. వీరి వ్యాఖ్యలను ఉదహరిస్తూ సమాజ్‌వాదీ పార్టీ తాజాగా స్పందించింది.

Farm Laws
Uttar Pradesh
SP
Narendra Modi
Samajwadi Party

More Telugu News